Full Style

>

ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్ , Irritable bowel Syndrome,IBS


ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే.. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ప్రకృతిలో రోగాల బారినపడని ప్రాణి ఏదీ ఉండదు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొన్ని జబ్బులకు వైద్యం లేదు. కొన్ని జబ్బులు బతికినంతకాలం ఉంటాయి. ఇంకొన్ని జబ్బులు తగ్గటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. మరికొన్ని జబ్బులు వాటి జ్ఞాపకాలను, అవశేషాలను వదిలిపోతాయి. ఇవి ఆయా జబ్బుల స్వభావం.

ఐబీఎస్‌--విచిత్ర వ్యాధికిది ప్రత్యక్ష నిదర్శనం! ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండదు. కానీ వ్యాధి మాత్రం వీడదు. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు.. లేదంటే అసలు కొంతకాలం విరేచనమే కాదు. వీటికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం! అన్నీ నిరంతరం మనసును తొలుస్తుండే బాధలే. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా.. పేగుల్లో ఏమీ ఉండదు. దీన్నే 'ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌'గా నిర్ధారిస్తారు. అందుకే ఈ వ్యాధి విషయంలో మనం పేగులనూ, శరీరాన్నే కాదు.. మనసును, మొత్తం అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవటం అవసరమం.

పూర్వకాలంలో- వ్యాధులనేవి భూత, ప్రేతాల కారణంగా వస్తున్నాయని భావించేవారు. వ్యక్తితో సంబంధం లేకుండా ఏవో అదృశ్యశక్తులు, అతీంద్రియ శక్తులు వ్యాధులకు కారణమవుతాయని అనుకునేవారు. ఈ భూతప్రేతాల భావన తప్పని.. 'వ్యాధి'కి కారణమేమిటన్నది మనం పరిశీలించాల్సిన అంశమని హిపోక్రటీసు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రవేశపెట్టాడు. వ్యాధి చికిత్సకు ఆయన రెండు రకాల ఔషధాలను సూచించాడు. అవి ఒకటి: వ్యాధి లక్షణాలకు వ్యతిరేక లక్షణాలు కలిగించేవి. రెండు: వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలనే కలిగించేవి. 'ఐబీఎస్‌'ను అర్థం చేసుకోవటంలో వ్యక్తి, వ్యాధి లక్షణాలు కూడా చాలా కీలకమైన అంశాలు. ఐబీఎస్‌ లక్షణాలన్నీ పేగుల కదలికల్లో అస్తవ్యస్తాన్ని సూచించేవేగానీ.. ఆ అస్తవ్యస్తమన్నది పేగుల్లో కాదు.. మొత్తం దేహవ్యవస్థ క్కూడా సంబంధించినది!

వ్యాధి అంటే.?
మన మనసులోగానీ, శరీరంలోగానీ తలెత్తే అస్తవ్యస్తాలే వ్యాధికి మూలం! ఈ అస్తవ్యస్తాలనేవి మనసులో, శరీరంలో రెంటిలో ఒకేసారి సంభవిస్తున్నాయి. ఈ అస్తవ్యస్తాలు ఎందుకు తలెత్తుతాయి అన్న ప్రశ్నకు-బాహ్య, అంతర్గత అంశాల ప్రేరణే కారణమని చెప్పుకోవచ్చు. ఈ బాహ్య, అంతర్గత అంశాల పట్ల వ్యక్తిలో తలెత్తే స్పందనలే వ్యాధుల రూపంలో బయటపడుతుంటాయి.

శరీరం-మనసు: మనం వ్యక్తిని 'శరీరం', 'మనసు'ల కలయికగా చూస్తాం. కానీ వాస్తవానికి శరీరానికీ, మనసుకూ భిన్నమైన వాడు వ్యక్తి. ఎందుకంటే 'నా శరీరం'.. 'నా మనసు' అంటాం. అంటే మనల్ని మనం ఈ శరీరానికి, మనసుకు భిన్నంగా భావిస్తున్నామనేగా అర్థం! అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవటానికి ఈ భావన బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా బీపీ ఉంటే కిడ్నీలు చెడిపోవచ్చు. కిడ్నీ సమస్య ఉంటే బీపీ రావొచ్చు. అంటే కిడ్నీకి గుండె అంతర్గత వాతావరణం అన్నమాట. వీటి మధ్య పరస్పరాధారమైన సంబంధం ఉంటుంది. ఒకవేళ గుండె రక్తాన్ని సరిగా పంప్‌ చేయలేదనుకుందాం. అప్పుడు రక్తం ఊపిరితిత్తుల్లో నిలిచిపోతుంది. ఆయాసం, దగ్గు వస్తాయి. ఇవన్నీ అంతర్గత వాతావరణ అంశాలకు ఉదాహరణలే. ఈ బాధల పట్ల వ్యక్తి స్పందనలే వ్యాధి లక్షణాలుగా వ్యక్తమవుతాయి. ఈ లక్షణాలు- వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉంటాయి కూడా. లక్షణాలను బట్టి ఔషధాలను ఎంపిక చేసేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ వ్యాధి చికిత్సకైనా ఈ అంశాల వివరాలు తెలియటం అవసరం. 'ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌' (ఐబీఎస్‌) చికిత్సకు ఇవి మరీ ముఖ్యం. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబడితే ఐబీఎస్‌ బాధితులకు చక్కటి మందులను ఎంపిక చేయటం సాధ్యమవుతుంది.

ఐబీఎస్‌
ఐబీఎస్‌ జీర్ణమండలానికి సంబంధించిన వ్యాధి. నోరు నుంచి మొదలుకొని.. నాలుక, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగులు, పెద్ద పేగులు, మలద్వారం.. అన్నీ జీర్ణమండలంలో భాగాలే. ఈ జీర్ణ వ్యవస్థను రెండు భాగాలుగా విభజించొచ్చు. నోరు నుంచి జీర్ణాశయం వరకు ఒకటి.. చిన్నపేగు నుంచి మలద్వారం వరకూ రెండో భాగం. మనిషిలో చిన్నపేగు, పెద్దపేగులు కలిసి సుమారుగా 30 అడుగుల పొడవుంటాయి. ఆహార నాళం గుండా ఆహారం ప్రయాణం చేస్తున్నప్పుడు పచనక్రియ, మల విసర్జన క్రియలు జరుగుతాయి. కడుపునిండా సుష్టుగా భోజనం చేసిన తర్వాత.. అది పూర్తిగా జీర్ణాశయాన్ని వదిలి పేగుల్లోకి వెళ్లటానికి 6 గంటల సమయం పడుతుంది. అక్కడ నుంచి ఆ ఆహారం పేగుల్లో యాణిస్తుంది. ఈ ప్రయాణంలో పేగుల కదలికలో తేడా వస్తే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. దీనికి బాహ్య కారణాలు దోహదం చెయ్యచ్చు. వీటిని సరిగా అర్థం చేసుకొని మందులు ఇస్తేనే వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
పేగుల కదలికలు త్వరత్వరగా జరిగితే వెంటనే విరేచనాలవుతాయి. అదే నెమ్మదిగా ఉంటే మలబద్ధకం ఏర్పడుతుంది. కదలికల అస్తవ్యస్తానికి నొప్పి కూడా తోడవుతుంది. అంతర్గత వాతావరణం వల్ల కూడా పేగుల కదలికలకు సంబంధించిన బాధలు వస్తుంటాయి. ఆందోళన ఎక్కువగా ఉంటే విరేచనాలు కావచ్చు. దిగులు పట్టుకుంటే మలబద్ధకం రావొచ్చు. ఐబీఎస్‌లో లింగ పరమైన అంశాలూ ప్రభావం చూపుతాయి. పురుషుల్లో కన్నా స్త్రీలల్లోనే మూడింతలు ఎక్కువగా కనిపించటమే దీనికి ఉదాహరణ. లింగభేదమే కాక.. చిన్నపేగు, పెద్దపేగులను చాలా అంశాలుప్రభావితం చేస్తుంటాయి. మానసిక ఒత్తిడి, ఆహారం, మాదకద్రవ్యాల వంటి జీవనశైలీ పరమైన అంశాలు, హార్మోన్ల వంటివన్నీ పేగుల కదలికలను ప్రభావితం చేయచ్చు. ఐబీఎస్‌లో అస్తవ్యస్తంగా సాగే పేగుల కదలికలను బట్టి చికిత్స సాగుతుంది. వాటిని సరిచేస్తే వ్యాధి నయమవుతుంది. మానసిక ఒత్తిడి, భావోద్వేగపరమైన వైరుధ్యాలు (ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్స్‌).. కుంగుబాటు, ఆందోళనలకు దారి తీస్తాయి. ఇవి ఉన్నప్పుడు ఐబీఎస్‌ బాధలు ఎక్కువవుతాయి.

* ఐబీఎస్‌ లక్షణాలైన మలబద్ధకం, అతిసారం, నొప్పి ఎప్పుడూ ఉండవు. వస్తూ పోతుంటాయి.
* వీటితో క్యాన్సర్‌ భయం లేదు.
* ఐబీఎస్‌ బాధితులకు రక్తం, మలం వంటివి పరీక్షించినా ఏ దోషాలూ కనిపించవు. పేగులు కూడా చూడటానికి బాగానే ఉంటాయి. అందుకే ఈ వ్యాధి విషయంలో మానసిక, శారీరక 'అస్తవ్యస్తాలకు' అంతటి ప్రాధాన్యం!

మందులు
ఐ.బి.య. లో చికిత్సావిధానము మూడు విదాలు గా ఉంటే మంచిఫలితాలు ఉంటాయి. 1. మానసికం  గా చికిత్స చేయడము ,
2. ఆహారములో మార్పులు చేయడము ,  
3. శారీరక చికిత్స .
ఐబీఎస్‌ జీర్ణవ్యవస్థకు మాత్రమే పరిమితమైన వ్యాధి కాదు. కొందరిలో విరేచనాలు, మరి కొందరిలో మలబద్ధకం, కొంతమందికి పొట్ట ఉబ్బటం.. ఇలా వ్యక్తి వ్యక్తికీ లక్షణాలు మారుతుంటాయి. కాబట్టి వ్యక్తిపరంగా.. శరీరతత్వం, మనస్తత్వం, జీవనశైలి, ఆలోచన, ఆవేశాలు, కుటుంబం.. పని.. సమాజం.. వీటి పరంగా వచ్చే ఒత్తిళ్లు, అలవాట్లు, వయసు, లింగ భేదం వంటి వాటన్నింటినీ పరిశీలించి మందులను ఎంపిక చేయాలి.

ఎక్కువ పీచుపదార్ధము ఉన్న ఆహారము తీసుకోవాలి ,
ఎక్కువ స్ట్రెస్ -స్ట్రైన్‌ ఉన్న పనులు మానుకోవాలి ,
పొగతాగడం పూర్తిగా పనికిరాదు ,
యాంటి స్పాజ్మాటిక్స్(Antispasmodics) -- డైసైక్లొమైన్‌(Dicyclomine)మాత్రలు
నొప్పి తీవ్రత బట్ట్టి రోజికి 1-2 వాడాలి ,లేదా.. హయోసిమైన్‌(Hyoscyamine)రోజుకి 1-3 వాడవచ్చును .
యాంటీ డయేరియల్స్(Anti diarrhoeals) : లోపరమైడ్ రోజుకి 1-3 మాత్రలు వాడవచ్చును .
యాంటీ డిప్రసెంట్స్(Anti depressents) : ఇమిట్రిప్టిలిన్‌ 10-25 మి.గ్రా. రోజుకి 1-3 వాడాలి. . . లేదా ఈక్విరెక్ష్ (clinium bromide + chlordizepam)రోజుకి 1-2 వాడవచ్చును .
ఎసిడిటి ఎక్కువగాఉంటే ... omeperazole + Domperadone కలిసి ఉన్న మాత్రలు రోజికి 1-2 వాడాలి .
ఇంకా ఎన్నో కొత్త మందులు వాడుకలో ఉన్నాయి . మంచి డాక్టర్ ని సంప్రదించి తగిన మందులు ... జీవితాంతము వాడాలి .




ఐబీఎస్‌లో రెండు రకాలున్నాయి.
* నొప్పితో : ఇందులో తీసుకున్న ఆహారం మూలంగా మలబద్ధకం గానీ నొప్పితో కూడిన అతిసారం గానీ కనిపిస్తాయి. కొన్నిసార్లు మలబద్ధకం, అతిసారం ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయి. మలంలో జిగురు పడొచ్చు. నొప్పి స్వల్పంగా గానీ మెలి పెట్టినట్టు గానీ ఉండొచ్చు. త్రేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి, నిస్త్రాణ, కుంగుబాటు, ఆందోళన, ఏకాగ్రత లోపించటం వంటివీ కనిపించొచ్చు.
* నొప్పి లేకుండా: ఇందులో అతిసారం గానీ, మలబద్ధకంగానీ ఉన్నా నొప్పి ఉండదు. అతిసారం చాలా వేగంగా మొదలవుతుంది. మల విసర్జన కూడా వెంటనే అవుతుంది. కొందరు నిద్ర లేస్తూనే విసర్జనకు పరుగెత్తాల్సి వస్తుంది. కొందరికి భోజనం చేసిన వెంటనే మల విసర్జన అవుతుంది. ఈ విరేచనాల బాధ నిద్రాసమయంలో ఉండదు. కొందరికి త్రేన్పులు, మల బద్ధకం, నొప్పి కనిపించవచ్చు.


ఐబీఎస్‌కు యాంటీబయోటిక్‌ మందు
మలబద్ధకం, విరేచనాలు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలతో ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) చాలామందిని తెగ ఇబ్బంది పెడుతుంటుంది. దీనికిప్పుడు కొత్త యాంటీబయోటిక్స్‌ చికిత్స అందుబాటులోకి రావటానికి మార్గం ఏర్పడింది. రెండు వారాల పాటు రిఫాక్సిమిన్‌ అనే యాంటీబయోటిక్‌ మందును వాడితే మెరుగైన ఫలితాలు కనబడుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఈ మాత్రలు వేసుకోవటం ఆపేసిన 10 వారాల తర్వాత కూడా ప్రభావం చూపటమే కాదు మలబద్ధకం మూలంగా కలిగే కడుపు ఉబ్బరమూ తగ్గుతుండటం విశేషం. ఈ మందు మలబద్ధకంతో కూడిన, మలబద్ధకం లేని ఐబీఎస్‌లోనూ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఐబీఎస్‌లో పేగుల్లోని సూక్ష్మజీవుల్లో ఏర్పడే మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది. యాంటీబయోటిక్‌ చికిత్స ప్రయోగాలకు ఇవే బీజం వేశాయి కూడా. కానీ ప్రయోగాల్లో నియోమైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ మిశ్రమ ఫలితాలను అందించటం నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు పేగులపై ప్రభావం చూపే రిఫాక్సిమిన్‌ మాత్రలు ఐబీఎస్‌లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలటం కొత్త ఆశలను రేకెత్తించింది.

ఐబీఎస్‌--ఆహారంతో దూరం

పేగుల్లో తలెత్తే పెద్ద చికాకు.. ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌). దీనితో బాధపడేవారికి గ్యాస్‌, త్రేన్పులు, కడుపునొప్పి వంటి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే కచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తే వీటి నుంచి చాలా వరకూ ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఐబీఎస్‌ బాధితులు సహజమైన చక్కెరలు తక్కువగా ఉండే పదార్థాలు (లో-ఫోడ్‌మ్యాప్‌) తినటం మంచిదని వివరిస్తున్నారు. ఎందుకంటే లో-ఫోడ్‌మ్యాప్‌ డైట్‌ పాటించటం వల్ల 80% మందికి త్రేన్పులు, కడుపునొప్పి, గ్యాస్‌ సమస్యలు తక్కువగా ఉంటున్నట్టు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వార్షిక సమావేశంలో ఆస్ట్రేలియా పరిశోధకులు ఈ లో-ఫోడ్‌మ్యాప్‌ ఆహార నియమాల గురించి వివరించారు. గోధుమలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుట్టగొడుగులు, గోబీపువ్వు, పాల పదార్థాలు, తేనె, యాపిళ్లు, పుచ్చకాయ, మామిడి పండ్లు.. వంటి వాటిల్లో ఈ ఫోడ్‌మ్యాప్‌ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం సరిగా జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల జీర్ణాశయంలోకి ఎక్కువ నీరు చేరటంతో ఐబీఎస్‌ లక్షణాలు ఉద్ధృతమయ్యేందుకు కారణమవుతోంది. అయితే ఇవి అందరిలోనూ ఎందుకు కనిపించవు? ఇందుకు కారణం జీర్ణాశయం ఆయా పదార్థాలకు అతిగా స్పందించటమే. ఐబీఎస్‌ బాధితుల్లో కడుపు ఉబ్బరం కొద్దిమోతాదులో ఉన్నప్పటికీ త్రేన్పులు, నొప్పి వంటివి తీవ్రంగా ఉంటాయి. సహజ చక్కెరలు గల పదార్థాలకు దూరంగా ఉంటే పోషక విలువలు తగ్గవా? ఇందుకోసం అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, టమోటాలు, బ్రెడ్లు, బియ్యం, ఓట్స్‌, క్యారట్లు, దోసకాయం, పచ్చి బఠానీలు, చిలగడ దుంపల వంటివి తీసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

Post a Comment

2 Comments

  1. దయచేసి ఐ బి ఎస్ కు సరైన డాక్టర్ పేరు సూచించ గలరు

    ReplyDelete
  2. హైదరాబాద్ లో కానీ లేదా ఇండియా లో ఎక్కడవున్నా

    ReplyDelete